దేశంలో నివాసానికి సౌకర్యగా పట్టణాల్లో ఏపీలోని మూడు పట్టణాలు టాప్-10లో నిలిచాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ నిర్వహించిన సర్వేలో ఏపీ సత్తా చాటింది. సర్వేలో ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం పట్టణాలు నివాస యోగ్య పట్టణాలుగా చోటు దక్కించుకున్నాయి. మొదటి మూడు స్థానాల్లో వరుసగా.. థానే, బెంగళూరు, భోపాల్ నగరాలుండగా.. గుంటూరు 6వ స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానంలో ఉన్నాయి. అటు పింప్రి చించ్వాడ్, మిరా, నవీ ముంబై, కల్యాన్ డోంబివాలి టాప్ 10లో నిలిచిన మిగిలిన పట్టణాలు.
గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్ అధికార యంత్రాంగం ముందు నుంచీ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేశారు. మెరుగైన స్థానం వస్తే అభివృద్ధికి నిధులు వస్తాయనే ప్రణాళికతో అలా చేశారు. గుంటూరు పట్టణం నుంచి అత్యధికంగా 3,32,620 మంది సర్వేలో పాల్గొని మద్దతుగా నిలిచారు. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది పాల్గొనగా, విశాఖ నుంచి 2.88 లక్షల మంది సర్వేలో అభిప్రాయాలు చెప్పారు. ఈ రెండింటికీ వరుసగా 8, 9వ స్థానాలు లభించాయి.