తెలంగాణలో భూ సమస్యలకు చెక్ చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను 2020లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్ను సీఎం కేసీఆర్ ప్రారంభించి మూడేళ్లు కావస్తోంది. పైసా లంచం ఇవ్వకుండా భూముల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపడంతో పాటు, మార్పులు చేర్పులు అన్నీ కూడా ఆన్లైన్లో నిర్వహించాలన్న సదుద్దేశంతో ఈ వెబ్ పోర్టల్ను తీసుకువచ్చినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆలోచన బాగున్నా ఇప్పుడు అదే పోర్టల్ పెద్ద సమస్యగా మారుతోంది. ధరణితో ఉన్న సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా ధరణిలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు సీసీఎల్ఏ అధికారులు తెలిపారు. వారంలో ఈ కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
భూ యజమానులకు ధరణి పోర్టల్లో అనేక సమస్యలు, సందేహాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు ఈ కొత్త సాప్ట్వేర్ ను ప్రవేశపెట్టబోతున్నారు అధికారులు. భూ యజమానులు తరచుగా అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇచ్చేలా ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ టెక్నాలజీని ధరణిలో ఇంట్రడ్యూజ్ చేయనున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా రైతులు వారి వారి సమస్యలను గుర్తించి తదనుగుణంగా ఏం చేయాలి , ఎవరిని కలవాలో సులువుగా తెలుసుకునే వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ కనుక అందుబాటులోకి వస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని భూ యజమానులు భావిస్తున్నారు.