తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లక్నవరం చెరువును చూడటానికి వచ్చిన, ఓ యువకుడు, యువతీ చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..”లక్నవరం చెరువులో ఇద్దరు మృతి చెందారు. వారిద్దరూ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు చెందినవారుగా గుర్తించాం. ఐఎస్బీకి చెందిన ఆరుగురు (నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) విద్యార్థుల బృందం సరదాగా చెరువులోకి దిగారు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయి మృతి చెందారు.” అని వివరాలు వెల్లడించారు.
అనంతరం తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు సాయి ప్రీతమ్ (24), తరుణి (20)గా గుర్తించారు. తమ పిల్లలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.