ఆస్తి కోసం ఆశపడి.. ఫోన్లోనే ట్రిపుల్ తలాక్
సమాజంలో వివాహ వ్యవస్థ చులకనగా మారిపోయింది. జీవితాంతం తోడుగా జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. కూరలో ఉప్పు వేయలేదని, చపాతీలు మాడిపోయాయని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేదని ఇలా పలు సాకులు చెప్పి ట్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు. వివాహ బంధానికున్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. తాజాగా ఝార్ఖండ్ ధన్బాద్ కు చెందిన ఓ మహిళకు.. ఆమె భర్త ఫోన్ లో తలాక్ చెప్పాడు. ఆస్తి కోసం ఆశపడి ఆమె భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికి భార్య ఒప్పుకోదని తెలిసి.. ఫోన్లోనే తలాక్ చెప్పాడు ఆ వ్యక్తి. అయితే, దీనిపై బాధితురాలు మూడు నెలలుగా న్యాయపోరాటం చేస్తోంది. తనకు ఎవరూ సహకరించడం లేదని వాపోయింది.
బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ధన్బాద్ జిల్లా చస్నాలాకు చెందిన అదిఫా ఫాతిమాకు బంగాల్లోని పురూలియా జిల్లాకు చెందిన అయూబ్ ఖాన్ తో 2016లో వివాహం జరిగింది. అతను బేకరీలో పని చేస్తుండేవాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు అయూబ్ ఖాన్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడని బాధితురాలి తండ్రి వివరించారు. ఆస్తికి ఆశపడే ఈ అన్యాయానికి పాల్పడ్డారని వాపోయారు.
ఈ నేపథ్యంలో.. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే, వారు తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నిరాశ చెందిన ఫాతిమా.. జిల్లా సీనియర్ ఎస్పీని ఆశ్రయించింది. ఆమె కంప్లైంట్ ఆధారంగా తీసుకున్న ఎస్ఎస్పీ ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేశారు. అయితే మహిళ భర్త తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు స్టేషన్ కు రాలేదని.. గడువు తేదీ ముగిశాక అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.