సాధారణంగా యువతిపై యువకుడి యాసిడ్ దాడి అనే సంగటనలు ఎక్కువగా వార్తల్లో వస్తూ ఉంటాయి. కానీ, అప్పుడప్పుడు ఇందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగింది. ప్రేమించి దూరం పెట్టడాన్ని ఓ మహిళ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. అగర్తలాకు చెందిన బీనా(27), సోమన్(30) ఒకే వీధిలో ఉండేవారు. పదేళ్ల కిందట ఇద్దరు ప్రేమించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయారు. 2010 నుంచి మహారాష్ట్రలోని పుణెలో సహాజీవనం చేస్తున్నారు. సోమన్ ఉన్నత విద్యకు అవసరమైన డబ్బులను బీనా ఉద్యోగం చేస్తూ సమకూర్చేది.
చదువు పూర్తైన తరువాత సోమన్కు ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమెకు చెప్పకుండా గతేడాది సోమన్ సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశాడు. అప్పటి నుంచి బీనాతో మాట్లాడటం మానేశాడు. సోమన్ కోసం ఆమె ఏడాదిగా చాలా ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు అక్టోబరు 19న త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్ను ఉన్నట్లు బీనా గుర్తించింది. అతనితో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సోమన్ ఆమెతో మాట్లాడడానికి నిరాకరించాడు. దీంతో ఆమె విచక్షణ కోల్పోయింది. కోపంతో అతనిపై యాసిడ్తో దాడి చేసింది. ఈ ఘటనలో సోమన్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బీనాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.