తెలంగాణలో మళ్లీ ఆకర్ష్ గులాబీ షురూ కాబోతుందా…గులాబీ గాలం ఎవరెవరకి వేయబోతోంది. ఇన్నాళ్లూ అభివృద్ధి పై నజర్ పెట్టిన సీఎం కేసీఆర్ మళ్లీ ఆకర్ష్ గులాబీ అస్త్రం ప్రయోగించబోతున్నారా…ఇందులో భాగంగానే సోమవారం టిడిపి, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు చేరారా..ఇంకారెవరు గులాబీ గూటికి చేరబోతున్నారు..?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్రావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాథోడ్, పైడిపల్లితో పాటు పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రమేశ్ రాథోడ్ వెంట తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేశ్ రాథోడ్, టీటీడీపీ జిల్లా కన్వీనర్ యూనిస్ అక్బానీ, కొమురాంభీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్కలాం, ఉమ్మడి జిల్లా గిరిజనేతరుల సంఘం అధ్యక్షుడు నాందేవ్, ఉపాధ్యక్షుడు బుట్టోతో పాటు 30 మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, పది మంది పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు టీఆర్ఎస్ లోకి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్రావు వెంట ఖానాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్రావు, ఎస్టీ సెల్ నాయకుడు భరత్ చౌహన్తో పాటు పలు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు టీఆర్ఎస్లో చేరారు.వీరి చేరికతో వలసలపై మళ్లీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంకా ఎవరెవరు కారెక్కుతారో నని చర్చించించుకుంటున్నారు.