400 మంది ఏపీ ఉద్యోగులకు ఊరట.. 10 బస్సుల్లో..
ఏపీ సచివాలయ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించింది.. హైదరాబాద్లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్డౌన్తో హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్లు ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్కు లేఖ రాశారు. హైదరాబాద్లో చిక్కుకుని తమ ఉద్యోగులు విధులకు రాలేకపోతున్నారని, ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్లో ఉన్న 400 మందికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ.. వారికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లో ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. కాగా, మియాపూర్, కేపీహెచ్బీ, ఎల్బీనగర్ నుంచి 10 ఆర్టీసీ బస్సుల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులను అమరావతికి తరలించనున్నారు.