తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్ ఎంసెట్- 2022) ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ఈ నెల 18, 19, 20 తేదీల్లో యథాతథంగా జరగనున్నాయి. మొత్తం 1, 72, 241 మంది విద్యార్తులు పరీక్షలు రాయనున్నారు. ఎంసెట్- 2022ను తెలంగాణలోని 89 కేంద్రాల్లో, ఏపీలోని 19 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహించే పరీక్షలకు… విడతకు 29వేల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు.
ఉదయం పూట నిర్వహించే పరీక్షలు 9గంటల నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం పరీక్షను 3 గంటలకు ప్రారంభించి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లో సూచించిన నిబంధనలను పరీక్షా సమంయంలో విద్యార్థులు కచ్చితంగా పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష తేదీలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షను జేఎన్టీయూ , హైదరాబాద్ నిర్వహిస్తోంది.