రాష్ట్రంలోని ప్రతినియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో అధునాతమైన మార్కెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిలక్షన్నర, రెండు లక్షల జనాభాకు అధునాతమైన వసతులతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివారం నాడు హైదరాబాద్ నగర మార్కెట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ జవాబిచ్చారు. నగరంలోని చాలా మార్కెట్లు హైజెనిక్ లేవన్న సీఎం కేసీఆర్…ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వందేళ్ల క్రితం నిర్మించిన మోండా మార్కెట్లో పరిస్థితులు చాలా బాగున్నాయన్నారు. మోండా మార్కెట్ ను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. మోండా మార్కెట్ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మార్కెట్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అదికారులను ఆశించినట్లు అసెంబ్లీ వేదికగా తెలిపారు. జిల్లా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో మోండా మార్కెట్ ను కలెక్టర్లు పరిశీలించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు.
ఇక రాష్ట్రంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను పలు జిల్లాల్లో నిర్మిస్తున్న విషయాన్నికూడా ప్రకటించారు. నిజామాబాద్, వరంగల్, పాలమూరు జిల్లాల్లో ఈ మార్కెట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీకి ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని మార్కెట్లను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు చూసి అభినందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో మార్కెట్లలో సరైన సౌకర్యాలు లేవన్న కేసీఆర్ అధునాతనమైన సౌకర్యాలతో మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు.