ప్రయాణీకులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త..1,016 కొత్త బస్సులు
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ ఓ శుభవార్తను చెప్పింది. దసరా పండుగ కానుకగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 1,016 కొత్త బస్సులను కొనేందుకు టెండర్లు పిలిచామని, ఈ టెండర్లో నేడు అశోక్ లేల్యాండ్, టాటా కంపెనీల అధికారులతో ధరల విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు బేరం కోసం భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 90శాతం ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులే నడుస్తున్నాయి. ప్రయాణికులు స్లీపర్ బస్సులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ట్రావెల్స్ పోటీని తట్టుకోవాలంటే స్లీపర్ బస్సులు సమకూర్చుకోవాలని, 16 స్లీపర్ బస్సులను కొనేందుకు అధికారులు నిర్ణయించారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్లీపర్ బస్సులు రానున్నాయన్నమాట.
'టీఎస్ ఆర్టీసీకి ప్రస్తుతం 6,200 సొంత బస్సులు ఉన్నాయి. అందులో దాదాపు వెయ్యి బస్సులు కాలం చెల్లి తుక్కుగా మారాయి. తగినన్ని బస్సులు లేక చాలా ప్రాంతాలకు ప్రజా రవాణా దూరమైంది. ఈ టెండర్ ద్వారా 1,016 బస్సులను అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే హైదరాబాద్ సిటీ రీజియన్ కోసం 300 ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకొస్తాం' అని ఆర్టీసీ అధికారులు వివరాలను వెల్లడించారు.