టీఎస్ ఆర్టీసీ మరో ముందడుగు..దేశంలోనే తొలిసారిగా - Telugu News - Mic tv
mictv telugu

టీఎస్ ఆర్టీసీ మరో ముందడుగు..దేశంలోనే తొలిసారిగా

June 18, 2022

తెలంగాణ ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని ఓ సరికొత్త సాంకేతికతను తొలిసారిగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐటీమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూమిషన్)లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మిషన్‌ల ద్వారా ప్రయాణానికి 20 నిమిషాల ముందు బస్సులో సీట్ల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోనేలా అధికారులు వసూలు బాటును కల్పించారు.

అంతేకాకుండా, బస్సు ఎక్కడ ఉంది? ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి? ప్రయాణికునికి స్టేజీకి రావడానికి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలన్నీ ఐ-టీమ్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా టికెట్ ఛార్జీలను చెల్లించడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం ఆర్టీసీ ఇప్పటికే 228 ఐ-టిమ్‌లు కొన్నట్లు అధికారులు వివరాలను వెల్లడించారు. మొదట ఏసీ బస్సుల్లో ఐటీమ్‌లను ముందుగా దూరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వీటిని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే, పుష్పక్ బస్సుల్లో అందుబాటులోకి తెచ్చారు. అనంతరం దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలు చేసి, దశలవారీగా అన్ని సర్వీసుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. జులై నెలలో కరీంనగర్ రీజియన్‌లో గరుడ, గరుడప్లస్, రాజధాని, ఇంద్ర లాంటి సర్వీసుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు కరీంనగర్ ఆర్ఎం ఖుస్రాషాఖాన్ తెలిపారు.