సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారు.. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in ని సంప్రదించాలన్నారు.