తాజాగా టికెట్ రేట్లను పెంచుతూ టీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. డీజిల్ సెస్ పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరుగుతున్న డిజిల్ ధరలు, నష్టాలు ఆర్టీసీని కుదేలు చేస్తున్నాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు మరోసారి ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనపు డిజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ భావించింది. సంస్థ రోజుకు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నదని, పెరిగిన డీజిల్ ధరలతో రోజూ రూ.5 కోట్ల నష్టం వస్తున్నదని తెలిపారు. ఏప్రిల్ 9న సెస్ తాత్కాలిక పెంపుతో డీజిల్ ఖర్చును పూడ్చలేకపోయామని, అందుకే డీజిల్ సెస్ను అదనంగా పెంచుతున్నట్టు తెలిపింది. విద్యార్థుల బస్ పాస్లపైనా చార్జీలు పెంచుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. రిజర్వేషన్ ప్రయాణికులకు సవరించిన చార్జీలు విధించబోమన్నారు. ఇప్పటికే జారీచేసిన బస్పాస్లు సైతం గడువు ముగిసే వరకు పాత రేట్లతోనే చెల్లుబాటు అవుతాయన్నారు.
పల్లె వెలుగు సర్వీసుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 45కు, ఎక్స్ ప్రెసుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ.90కి, డిలక్స్ సర్వీసుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 125కు, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ. 10 నుంచి రూ. 170కి డిజిల్ సెస్ పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అయితే తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులపై డిజిల్ సెస్ విధించకపోవడంతో నగర వాసులపై ప్రభావం పడటం లేదు. ప్రస్తుతం పెరిగిన టికెట్ ధరలు ఈరోజు(గురువారం) నుంచి అమలులోకి రానున్నాయి.