టీటీడీ భక్తులకు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. సెప్టెంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను నేడు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేశామని పేర్కొన్నారు. టికెట్లు పొందిన వారి జాబితాను నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించామని, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించినట్లు తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ..”కాసేపటిక్రితమే సెప్టెంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేశాం. లక్కీడిప్ టికెట్ల జాబితాను వెబ్సైట్లో ఉంచాం. జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్సైట్లో లక్కీడిప్ టికెట్ల కోసం భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా భక్తులకు టికెట్ వివరాలను తెలియజేస్తాం. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్ 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల అవుతాయి” అని తెలిపారు.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు.