కనురెప్పలే కాటేస్తున్నాయి. రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్న భారతావనిలో ఒళ్లు జలదరించే ఘోరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సొంత చెల్లిలిపై ఇద్దరు అన్నలు నాలుగేళ్లుగా సాగించిన అత్యాచారకాండ వెలుగుచూసింది. మానవ సంబంధాలకే మచ్చతెచ్చిన ఈ ఘోరం నేరాల అడ్డా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది.
నర్సింగ్ కోర్సు చదువుతున్న 16 ఏళ్ల బాధితురాలపై ఆమె పెద్దన్న(23), చిన్నన్న (21) ఈ దారుణానికి తెగబడ్డారు. వారి తండ్రి కొన్నాళ్ల కిందట చనిపోయాడు. విషయం బయటపెడితే నీతోపాటు అమ్మను కూడా చంపేస్తామని బెదిరించారు.దీంతో బాధితురాలు బయటికి చెప్పుకోలేకపోయింది. ఇక భరించలేక తల్లి సూచనపై వీడియో తీసి బుధవారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అందించింది. తనను ఆ రాక్షసులనుంచి కాపాడాలని భోరున విలపిస్తూ ఎస్పీని కోరింది. పోలీసులు వెంటనే ఆ దుర్మార్గులను అరెస్ట్ చేశారు.