నా చావుకు కారణం లాక్డౌనే అంటూ రైలుకింద పడి..
లాక్డౌన్ బడుగుజీవుల బతులకు ఛిద్రం చేస్తోంది. ప్రభుత్వాలు చేస్తున్న పిసరంత సాయం ఏ మూలకూ చాలక పేదల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తన చావుకు లాక్డౌనే కారణమంటూ నడియవస్కుడు సూసైడ్ నోట్ రాసి బతుకు చాలించాడు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
షాహజన్పూర్ జిల్లాకు చెందిన భానుప్రకాశ్ గుప్తా(50) హోటల్లో పనిచేస్తున్నాడు. భార్య, నలుగురు పిల్లలు, తల్లితో కలిసి అద్దెంట్లో ఉంటున్నాడు. లాక్డౌన్ వల్ల హోటళ్లు మూతపడ్డంతో పూట గడవడం కష్టంగా మారింది. దీనికితోడు మరోసారి లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని వార్తలు రావడంతో అతడు రైలు కిందపడి చనిపోయాడు. పక్కనే సూసైట్ నోట్ కనిపించింది. ‘లాక్ డౌన్ పొడిగింపు వల్ల నా భార్యాపిల్లలకు ఇంత కూడు పెట్టలేకపోతున్నాను. నేను బతికి వ్యర్థం. అందుకే చనిపోతున్నాను..మా ఇంట్లో కాస్త గోధుమపిండి, బియ్యం ఉన్నాయి. కానీ అవి సరిపోవు. చక్కెర, ఉప్పు, పాలు కొనడానికి నా దగ్గర డబ్బుల్లేవు.. మా అమ్మకు ఆస్పత్రిలో చూపించలేకపోతున్నాను.. ’ అని అందులో రాశాడు.