తనకు అన్యాయం జరిగిందని, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు అక్కడ పనిచేస్తున్న స్టేషన్ ఆఫీసర్. రేప్ బాధితురాలికి ధైర్యం చెప్పి, న్యాయం చేయాల్సిన ఆ అధికారి.. మరింత దిగజారి నీచంగా ప్రవర్తించాడు. యూపీలోని లలిత్ పూర్ లో ఈ దారుణం జరిగింది. ఏప్రిల్ 22వ తేదీన మైనర్ బాలికను భోపాల్ తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడి అనంతరం ఏప్రిల్ 26న బాధితురాలిని పాలీ పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఏప్రిల్ 27వ తేదీన కంప్లయింట్ చేసేందుకు పోలీస్ స్టేషన్కు మేనత్తతో వెళ్లిన బాలికపై అక్కడి ఇన్స్పెక్టర్… ఆరోజు సాయంత్రం స్టేషన్లోని ఓ గదిలోనే అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె అత్తకు అప్పగించాడు.
ఏప్రిల్ 30న బాధితురాలిని కుటుంబ సభ్యులు చైల్డ్ లైన్ కు అప్పగించారు. బాలికకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. జరిగిన దారుణమంతా చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు చందన్, రాజ్భాన్, హరిశంకర్, మహేంద్ర చౌరాసియా, ఇన్స్పెక్టర్ తిలక్ధారి సరోజ్, గులాబ్బాయి అహిర్వార్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.