యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. యూపీలో ఎస్మా ప్రయోగం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలపాటు అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తున్నట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆరు నెలలు ప్రభుత్వం, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఆధీనంలోని ఎలాంటి సేవలైనా నిలిపివేయడం కుదరదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్మా చట్టం అమల్లో ఉండగా పోస్టల్, టెలీగ్రాఫ్, రైల్వే, పోర్టు కార్యకలాపాలు సహా అత్యవసర సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులెవరూ సమ్మె చేసేందుకు వీల్లేకుండా నిషేధం కొనసాగుతుంది.
ఎస్మాకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడగా.. మొదలు వచ్చే ఆరు నెలలపాటు రాష్ట్రంలో ప్రజా సేవలను స్తంభింపజేయడంపై నిషేధం విధించనున్నారు. ఎస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తే నిందితులకు ఏడాది పాటు జైలుశిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ ఏకకాలంలో విధించే అవకాశం ఉంటుంది. సమ్మె చేసేవారే కాదు, సమ్మెకు ప్రోత్సహించే వారు కూడా ఈ చట్టం ప్రకారం నేరస్థులే అవుతారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిచిన వారిని ఎలాంటి అరెస్టు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని తెలిపారు.