తెలంగాణలో సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈనెల 15 దాకా కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి కాసేటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల కమిటీ (బీఏసీ) ప్రకటన విడుదల చేసింది. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సమావేశాలలో.. మంత్రి హరీశ్ రావు 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ. 2.56 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
అనంతరం బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, అందుకు అవసరమయ్యే సమయాన్ని ప్రభుత్వం బేరీజు వేసుకుంది. ఈనెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానించింది. సమావేశాల్లో భాగంగా ఈనెల 13వ తేదీన ఆదివారం మాత్రమే సెలవుగా ప్రకటించారు. అంటే.. ఈ నెల 15 వరకు అంటే.. 8 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలిపారు.