కొండను ఢీకొన్న మన కుర్రోడికి జేజేలు!
మన దేశానికి చెందిన యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్ ఒక్కసారిగా తెలియని వారికి కూడా తెలిసిపోయాడు. 22 ఏళ్ళ వయసులోనే యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెదరర్తో తలపడ్డాడు. ఈ మ్యాచ్లో తొలి సెట్ను 6-4తో గెలిచి మంచి జోష్లో నాగల్.. చివరకు ఫెదరర్ అనుభవం ముందు నాగల్ తలవంచక తప్పలేదు.
రెండో సెట్లో నాగల్ 1-6 తేడాతో కోల్పోగా, మూడో సెట్లో 2-6తో వెనుకంజ వేశాడు. కాగా, నాల్గో సెట్లో తిరిగి పుంజుకున్న నాగల్.. ఫెదరర్కు అంత తేలిగ్గా లొంగలేదు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన నాలుగో సెట్లో నాగల్ 4-6 తేడాతో పోరాడి ఓడిపోయాడు. దాంతో యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ నుంచే నాగల్ నిష్క్రమించాడు. కాగా, గత ఇరవై ఏళ్ళ కాలంలో ఒక గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాలో కనీసం ఒక్క సెట్ గెలిచిన నాలుగో భారత ఆటగాడిగా నాగల్ గుర్తింపు సాధించాడు. హరియాణాకు చెందిన నాగల్ టెన్నిస్ ఆటలో ప్రపంచ దిగ్గజాలను మట్టికరిపిస్తాడని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు.