రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి, గ్రామ సర్పంచులపై వ్యవహరిస్తోన్న తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సర్పంచులకు వెంటనే నిధులు విడుదల చేయాలని.. అదే విధంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
“రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయలను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసింది. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన రూ 250 కోట్ల రూపాయలు 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలని సర్పంచులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నిధుల్లేక.. చేసిన పనులకు నిధులు రాక.. సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల.. చేతిలో పైసా లేక చాలా మంది సర్పంచులు, ఉపసర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అధికార పార్టీ సర్పంచులు, ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, చేసిన పనులకు బిల్లులు రాక, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారు” అని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో పనులు చేయకపోతే సస్పెండ్ చేస్తామని అధికారులు సర్పంచులను బెదిరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ అన్నారు. చేసిన పనులకు బిల్స్ ఇవ్వడం లేదని. వచ్చిన కొద్దిపాటి నిధులను ట్రాక్టర్ ఈఎంఐలకు కట్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి గందరగోళంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వెంటనే సర్పంచుల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచుల నిధుల కోసం ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీని అడ్డుకుని.. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు.