పోలీసులపై నిరసనతో రోజూ గుండు
తన తండ్రిని హత్య చేసిన హంతకులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వింత నిరసనకు పూనుకుంది. గత పక్షం రోజులుగా ప్రతిరోజు గుండు కొట్టించుకుంటూ పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాకు చెందిన పునీత్ సింగ్ అనే మహళ తండ్రి జోగేందర్ ఆగస్టు 22న హత్యకు గురయ్యారు.
జోగేందర్ వద్ద నమ్మకస్తుడిగా ఉండే రాజీవ్ ఖండేల్వాల్, అతడి కుమారుడు ఈ హత్య చేసారంటూ పునీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. కేసు నమోదు చేసేందుకు మొదట పోలీసులు వెనకాడినట్టు ఆమె తెలిపింది. దీంతో తన తండ్రి హత్యకు పోలీసులకు సంబంధం ఉండొచ్చని ఆమె ఆరోపించింది. ఇంత కాలం గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడంతో ఆమె పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత పదిహేను రోజుల నుంచి ప్రతి రోజు గుండు కొట్టించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఇలాగే చేస్తానంటుంది.