తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభంకానుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో ప్రస్తుతం 25కుపైగా రైలు సర్వీసులు నడుస్తున్నప్పటికీ శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో లేవు.
ప్రస్తుతం ఉన్న రైళ్లలో జర్నీ టైం 11 గంటలు పడుతుండగా.. వందే భారత్ ట్రైన్తో ఈ సమయం చాలా తగ్గనుంది. 6 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇప్పటికే నాగ్పుర్- సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ కోసం రైల్వే శాఖ.. రూట్ మ్యాప్ కూడా సిద్దం చేసినట్లు సమాచారం. బల్లార్షా, సిర్పూర్- కాగజ్నగర్, రామగుండం, కాజిపేట్ జంక్షన్లలో ఈ రైలు ఆగనుంది.
తాత్కాలిక టైంటేబుల్..
ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక టైంటేబుల్ను అధికారులు రూపొందించారు. దీని ప్రకా రం రైలు నాగ్పూర్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్ చేరుకోనుంది. మళ్లీ మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్పూర్ చేరుకుంటుంది.వారంలో ఆరు రోజులు ఈ రైలు తిరగనుంది. ఎకానమీలో రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్లో రూ.2,750–రూ.2,850 వరకు చార్జీలను ఖరారు చేసే అవకాశం ఉంది.