ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలోని అధికార వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగానే బయట పెడుతున్నారు. మొన్నం ఆనం నారాయణ రెడ్డి, నిన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయని.. 10 మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితులను చూస్తే.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా, ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని అనిపిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని చెప్పారు.
గుంటూరులో జరిగిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై స్పందిస్తూ… ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని, అలాంటి వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెడితే ఎన్ఆర్ఐలు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు వస్తారని అన్నారు. తొక్కిసలాట ఘటనను చిలవలు, పలవలు చేసి చూడటం సరికాదని అన్నారు. గత మూడున్నరేళ్ల కాలంలో ఒక్కరిపై కూడా తాను అక్రమ కేసులు పెట్టించలేదని… ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నేతలకు అసంతృప్తి ఉండొచ్చని అన్నారు.