ఏడు కొండలపై వెలసిన పవిత్రాద్భుత ఆలయం. ప్రపంచంలో ఎక్కువమంది దర్శించుకునే హిందూ ఆధ్మాత్మిక క్షేత్రాల్లో ఒకటి. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడినే గుండెల్లో దాచుకున్న దివ్యక్షేత్రమే తిరుమల. దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం వేరు. ఎంత మంది దేవుళ్లు ఉన్నా సప్తగిరులపై వెలసిన ఆ దేవదేవుడ్నిదర్శించుకుంటేనే ఆధ్మాత్మిక సంతృప్తి. ఆధ్మాత్మిక స్వర్గానికి ముఖద్వారమైన తిరుమలకు నిత్యం 60 నుంచి 70వేల మంది భక్తులు వస్తుంటారు. విశేష దినాల్లో ఆ సంఖ్య లక్షకు పైగా ఉంటోంది.
తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’ మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు కొలుస్తారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
కలియుగారంభంలో…. అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
కొండపైకి ఇలా …..
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకునే భక్తులకు స్టేషన్ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీసు నడుస్తుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు టీటీడీ అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న తర్వాత టోల్ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు టీటీడీ బార్ కోడింగ్ రశీదులను ఇస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం…..
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి దేవస్థానం అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను ఉచితంగా ఇస్తారు. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని టీటీడీయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
వసతి సౌకర్యం…
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి,-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్, ఇతర వివరాలకు టీటీడీ కార్యాలయంలో సంప్రదించాలి.
కల్యాణ కట్ట..మొక్కుల అడ్డా …..
ఇలా కొండపైకి చేరుకున్న భక్తులు దర్శనానికి ముందు కల్యాణకట్టలో తలనీలాలు ఇస్తారు. ఆచారంగానే కాకుండా మొక్కురూపంలో వీటిని సమర్పిస్తారు. ఇక్కడి నుంచి క్యూ లైన్లలోకి వెళ్తారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షణ ఉంటుంది. విశ్రాంతి కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో టికెట్టు తీసుకున్నా..క్యూలైన్లలో వచ్చినా .శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయ ప్రవేశం కోసం ఇక్కడే గంటలకొద్దీ నిరీక్షించాలి. ఆనందనిలయంలో వేంకటేశ్వరస్వామితో పాటు, ఆనంద నిలయంపైన గల విమాన వేంకటేశ్వరస్వామిని సైతం భక్తులు దర్శించుకుంటూ వుంటారు. గర్భాలయం పై కోణం ఆకారంలో గల నిర్మాణాన్ని ‘విమానం’ అంటారు. విమానంపై కనిపించే వేంకటేశ్వర స్వామి చిన్న ప్రతిమనే విమాన వేంకటేశ్వరస్వామి అని పిలుస్తుంటారు. స్వామికి రెండు వైపులా బాలకృష్ణుడు … గరుత్మంతుడు … హనుమంతుడి ప్రతిమలు దర్శనమిస్తూ వుంటాయి. సాధారణ మానవులకు ఈ విమానం ఒక నిర్మాణంగా మాత్రమే కనిపిస్తుందనీ, తపోబల సంపన్నులకు మాత్రం పుష్పక విమానంలా కనిపిస్తుందని అంటారు.
ఇక ప్రధాన ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో కొలువై ఉంది.ఆలయం 415 అడుగుల ఎత్తు , 263 అడుగుల వెడల్పుతో ఉండే నిర్మాణం ఇది. భక్తులందరు మహాద్వారంగా పిలిచే 50 అడుగల ఎత్తైన గాలిగోపురం నుంచి ఆలయప్రాకారంలోకి అడుగు పెడతారు.ఆలయ ప్రాకారంలో గర్భాలయానికి ముందుగా ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడ నుంచి ఎడమ వైపు వెళితే రంగనాయక మంటపం వస్తుంది. ధ్వజస్తంభానికి కుడివైపున అద్దాల మండపం. ఉంటుంది. ఇది అసంఖ్యాక ప్రతిబింభాల్ని ఏర్పరిచే గది.
అక్కడ నుంచి వెళితే గర్భ గుడి మార్గంలో ముందుగా వెండివాకిలి ఉంటుంది. ఈ గడప మొత్తం వెండిరేకులతో తాపడం చేసి ఉంటుంది.అటుపైన బంగారు వాకిలి వస్తుంది. బంగారువాకిలి దాటి ముందు వెళ్లే భాగ్యం చాలా మంది భక్తులకు లభించదు.ఇక్కడ నుంచి గర్భాలయం వరకు వరుసగా గడపలుంటాయి.ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో గడప వెడల్పు తగ్గుతూ ఉంటుంది. జీవిత్మా పరమాత్మా కలిసే మార్గానికి ఇది సంకేతమని విశ్వాసం. అందుకే దీన్ని గర్భాలయం అంటారు. ఇందులోనే శీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు….
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను టీటీడీ నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస దగ్గరకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది.
అన్నప్రసాదం….
తిరుమలలో భక్తులందరికీ టీటీడీ స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు 40 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తోంది.
మహా ప్రసాదం లడ్డూ….
ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం.రుచి, శుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే దీనికి భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది. పది హేనేళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు. ఇపుడు ఆ సదుపాయం లేదు.ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకులు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.
దర్శనం అయ్యాక……
ఇక దేవదేవుడి దర్శించుకున్న తర్వాత తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. టీటీడీ బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.