చైనాలో విస్తృతంగా పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆ దేశానికి సూచించింది. ఈ మేరకు డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం వీక్లీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘చైనాలో కేసులు భారీగా పెరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా (చైనాలో) అత్యధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు టీకాలు అందించేందుకు ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. క్లినికల్ కేర్, దాని హెల్త్ సిస్టమ్ ను రక్షించేందుకు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం’’ అని టెడ్రోస్ తెలిపారు.
"In order to make a comprehensive risk assessment of the situation on the ground, WHO needs more detailed information on disease severity, hospital admissions and requirements for intensive care units support"-@DrTedros https://t.co/2usxAOXCjj
— World Health Organization (WHO) (@WHO) December 21, 2022
కాగా.. కరోనా మహమ్మారి మొదలైన నాటి 2020 నుంచి చైనా కఠినమైన ‘జీరో కోవిడ్ పాలసీ’ని అమలు చేస్తోంది. దీని వల్ల ఇంత కాలం ఆ దేశంలో కోవిడ్ కంట్రోల్ లో ఉంటూ వచ్చింది. కానీ నిబంధనల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఉద్రేకం, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న గణనీయమైన ప్రభావం వల్ల ఈ డిసెంబర్ నెల ప్రారంభంలో చైనా ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండానే జీరో కోవిడ్ పాలసీని ఎత్తేసింది. ఫలితంగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో కొవిడ్ మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం మహమ్మారి కీలక దశలో ఉన్నామని అర్థమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్ ఎమర్జెన్సీ కమిటీలో సలహాదారుడిగా ఉన్న డచ్ వైరాలజిస్ట్ మేరియన్ కూప్మన్స్ పేర్కొన్నారు. ఇప్పటివరకు చైనాలో పెండింగులో ఉన్న ఈ మహమ్మారి విజృంభణ తన దృష్టిలో ‘వైల్డ్ కార్డు’ అని అన్నారు.