వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ పీజీ మెడికో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించారు. అనస్తీషియా విభాగంలోని పీజీ వైద్యురాలు డాక్టర్ ప్రీతి ఈ రోజు తెల్లవారుజామున విధుల్లో ఉండగా హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన తోటి వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఈ విషయాన్ని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్దాస్ ధ్రువీకరించారు. రెండు రోజుల క్రితం సీనియర్ వైద్యులు ఆమెను వేధించారని తండ్రి చెబుతున్నారు. ఈ విషయమై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్కు కూడా ఫిర్యాదు చేశారని సమాచారం. ఇదే విషయమై ఆత్మహత్యాయత్నం చేసుకుందని ప్రీతి తండ్రి చెబుతున్నారు.
అయితే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని ఎంజీఎం సూరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రీతిని రక్షించే ప్రయత్నం చేశామన్నారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ నిమ్స్కు తరలించినట్టుగా చెప్పారు. ఇవాళ ఉదయం గుండెనొన్పి, తలనొప్పి అని చెప్పిందని డాక్టర్ చంద్రశేఖర్ మీడియాకు చెప్పారు. వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందా , ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ విషయమై విచారణ చేస్తున్నామన్నారు. ప్రీతి హనికరమైన ఇంజక్షన్ తీసుకున్నట్టుగా తమకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ప్రీతితో పాటు విధులు నిర్వహించిన మరో ఇద్దరిని కూడా ఈ విషయమై విచారించినట్టుగా డాక్టర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.
ప్రీతి ఏదైనా ఇంజక్షన్ తీసుకుంటే ఆ ఇంజక్షన్ కు విరుగుడు ఇవ్వడానికి ఈ సమాచారం తెలుసుకున్నామని ఆయన వివరించారు. మూడు మాసాల క్రితం ప్రీతి తమ కాలేజీలో చేరిందన్నారు. మూడు మాసాల నుండి వేధింపులు జరుగుతున్నాయా లేదా అనే విషయం విచారణలో తేలనుందన్నారు. ఇంతకాలం నుండి ప్రీతి వేధింపులను భరిస్తుందా , ఇటీవల కాలంలోనే వేధింపులు ప్రారంభమయ్యాయా అనే విషయమై విచారణ కమిటీ తేల్చనుందని తెలిపారు. ప్రీతిపై సీనియర్ ర్యాగింగ్ కు పాల్పడితే చట్టప్రకారం శిక్షిస్తామని , ఈ విషయమై పోలీసులకు కూడా తాము ఫిర్యాదు చేసినట్టుగా సూపరింటెండ్ తెలిపారు. పోలీసుల విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు.