టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్ దారుణ హత్య కేసు దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. మురళి హత్యకేసులో కాంగ్రెస్ నేతల ప్రమేయమున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, ఏ-5 పోతుల శ్రీమాన్, ఏ-6గా కానుగంటి శేఖర్ పేర్లను చేర్చారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి గురువారం హత్యకు గురయ్యారు. ఆరోజు సాయంత్రం ఆయన్ను ఇంట్లోనే ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆ తర్వాత హత్యాయుధాలను దారి పొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. అయితే రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తమ పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్రెడ్డి, శ్రీమాన్, శేఖర్ ఆరోపిస్తున్నారు. మురళి తమకు మంచి స్నేహితుడని చెబుతున్నారు. ఆధారాల్లేకుండా ఎఫ్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేయడం బాధాకరమంటున్నారు.