తెలంగాణ రాష్ట్రంలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ, కేసీఆర్ టీఆర్ఎస్ మంత్రులను ఢీల్లీకి పంపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..”కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలి అనడం సరైంది కాదు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదు. ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, కేసీఆరే రైతులకు రక్షణ కవచం” అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.అంతేకాకుండా రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేకపోయానని, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాకుండా ‘తెలంగాణ ప్రజల కోసం మేం ఎన్ని అవమానాలైన భరిస్తాం. కానీ సమయం వచ్చినప్పుడు తెలంగాణ బదులు తీర్చుకుంటుంది. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉంది. ఇంత పెద్ద భారతదేశంలో రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతాం’ మంత్రి తెలిపారు.