మహాభారతంలో పంచ పాండవులు ద్రౌపదిని భార్యగా స్వీకరించిన సంగతి మనకు తెలిసిందే. అది పూర్తిగా కథ మాత్రమేనా? నిజంగా జరిగిందా అని మనకు తెలియదు. అయితే పురాతన కాలంలో అలాంటి ఆచారాలు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతుంటారు.
ఒకరికి ఐదుగురు భర్తలా? అని ఇప్పుడు మనం ఆశ్చర్యపోతున్నా అప్పట్లో అలాంటి ఆచారాలు ఉండేవి. అప్పుడే కాదండోయ్.. ఇప్పటి మన నాగరిక సమాజంలోనూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కూడా మన దేశంలోనే.. అన్నదమ్ములందరూ కలిసి ఒకే మహిళను వివాహం చేసుకుని ఆమెతోనే సంసారం చేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నవ నాగరిక లోకంలో ఇటువంటి అతి ప్రాచీన ఆచారాలు కొనసాగుతూ ఉండటం ఆశ్చర్యమే కదా.
ఒకే మహిళను ముగ్గురు నలుగురు సోదరులు పెళ్లి చేసుకోవడం కొన్ని హిమాచల్ తెగల ఆచారం. అక్కడి కుటుంబాలు ప్రధానంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తాయి. దీంతో వారంతా కలిసి కట్టుగా పని చేసుకుంటూ జీవనం వెల్లదీస్తారు. అన్నదమ్ములు వేర్వేరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వేరు కాపురాలు పెట్టుకుంటే సమస్యలు వస్తాయని వారి భయం. కుటుంబ పోషణ, ఆస్తుల పంపకాల్లో గొడవలు వస్తాయని ఆందోళన పడుతుంటారు. అందుకే ఈ సమస్యలకు పరిష్కారంగా అన్నదమ్ముళ్లు ఒక మహిళనే పెళ్లి చేసుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని తాము ఇంకా కొనసాగిస్తున్నామని సదరు కలియుగ పాండవులు అంటున్నారు.
ఇలాంటి వింత ఆచారాలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒకరి భార్యను మరొకరు ఎత్తుకుపోతారు. ఇంకో దేశంలో భార్యలను పరస్పరం మార్చుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనదేశంలో మహాభారతాన్ని తలపించే ఈ ఆచారం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.