భూమిపై మూడు వంతుల నీరు, ఒకవంతు భూభాగం ఉంటుందని మనకు తెలుసు. శుక్ర గ్రహం(వీనస్)పై కూడా నీళ్లు ఉండేవని, అవి ఆవిరికావడంతో వేడిగా మారిందని నాసా శాస్త్రవేత్తల అంచనా. ఆ గ్రహంలోని నీరు ఎలా ఆవిరైందో తెలుసుకోడానికి పరిశోధనలు చేస్తున్నారు. ‘శుక్ర గ్రహం చుట్టూ ఉన్న అయనోస్ఫియర్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ (సంభావ్య విద్యుత్) ఉండేది. అది నీటిని మొత్తం వాక్యూమ్ క్లీనర్లా లాగేసుకుంది. భూమి చుట్టూ ఉన్న అయనోస్ఫియర్లోనూ ఇలాంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉన్నాయి. శుక్రుడిపై జరిగినట్టే, ఈ భూమిపైనా జరుగుతుందా? అంటే కచ్చితంగా కాదు’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ను లెక్కించేందుకు ఈనెల 9న నాసా ఎండ్యూరెన్స్ అనే ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఈ ప్రయోగం ద్వారా.. ‘ఆర్కిటిక్ మహాసముద్రంలోని నార్వే ద్వీపకల్పం శవల్బార్డ్ నుంచి భూమిపై అయస్కాంత క్షేత్రం ఉన్న ఉత్తరధ్రువానికి రాకెట్ను పంపనుంది. భూ వాతావరణం నుంచి తప్పించుకుని, వెళ్లిపోతున్న ఎలక్ట్రాన్ల శక్తిని ఎండ్యూరెన్స్ ద్వారా లెక్కిస్తారు. వాస్తవానికి ఎలక్ట్రాన్లు భూ వాతావరణం నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయేవి. కానీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వల్ల అదిప్పుడు కొంచెం నెమ్మదించింది. ఎందుకలా జరుగుతోందో తెలుసుకోడానికి ఈ ప్రయోగం చేపట్టాం’ అని నాసా వెల్లడించింది. మిషన్ సక్సెస్ అయితే, ప్రపంచంలోనే భూమి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ను లెక్కించిన మొట్టమొదటి తొలి ప్రయోగం ఇదే అవుతుందని తెలిపారు