తల్లితండ్రులతో కాలక్షేపం కోసం.. రూ. 5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా
సంపాదన వేటలో పడిన యువత.. కని పెంచిన తల్లితండ్రులను వదిలి, విదేశాలకు పయనమవుతున్న ఈ రోజుల్లో.. కోట్ల సంపాదన వదిలిపెట్టి స్వదేశానికి వచ్చేయనున్నారు ఓ కంపెనీ సీఈవో. లక్షల కోట్ల విలువైన ‘జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండ్రూ ఫార్మికా.. తన తల్లిదండ్రుల కోసం సీఈవో జాబ్ను తృణ ప్రాయంగా వదిలేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం ఈనాటి కొంతమంది యువతకు కనువిప్పును కలిగిస్తోంది. పెద్ద వయస్కులైన తన తల్లిదండ్రుల్ని చూసుకోవటం కోసం 5లక్షల కోట్ల రూపాయల కంపెనీ సీఈవో పదవికి రిజైన్ చేశాడు. టెన్షన్ బతుకులు వదిలిపెట్టి తన లైఫ్ను కాస్త భిన్నంగా.. ప్రశాంతంగా గడపాలని లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫండింగ్ కంపెనీకి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఇప్పుడీ వార్త కార్పొరేట్ ప్రపంచంలో షాకింగ్గా మారింది.
2019లో ఆ కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆండ్రూ.. వ్యక్తిగత కారణాలతోనే తన సీఈవో పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో 27 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ఆండ్రూ ఫార్మికా వివిధ సంస్థల్లో విలువైన సేవలందించారు. అసెట్ మేనేజర్, ఈక్విటీ ఫండ్ మేనేజర్, ఈక్విటీల హెడ్తోపాటు పలు రకాల బాధ్యతలను నిర్వహించారు. అక్టోబరు 1 నుంచి ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని బ్లూమ్ బర్గ్ విషయాన్ని వెల్లడించింది. ఇకపై ఆయన మరే ఇతర సంస్థలోనూ చేరడం లేదని, కుటుంబంతో గడిపేందుకు, వ్యక్తిగతంగా బీచ్లో సేద తీరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆండ్రూ ఫార్మికా మూడు దశాబ్దాలుగా ఇంగ్లాండ్లోనే ఉన్నారు. అక్టోబర్ 1 తర్వాత స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో గడపనున్నారు. ‘బీచ్లో కూర్చొని ఏమీ చేయకుండా కాలక్షేపం చేయాలనుకుంటున్నా’ అని బ్లూమ్బర్గ్కు ఆండ్రూ తెలిపారు.