జీవిత భాగస్వామిగా కలకాలం తోడుంటానని ఆ హెడ్ కానిస్టేబుల్.. పెళ్లి నాడు చేసిన ప్రమాణాలను మరచిపోయాడు. సహచరిని అనుమానిస్తూ నిత్యం మానక్షోభకు గురిచేశాడు. అతని వేధింపులు తాళలేక, అతడిని విడిచి పుట్టింటికి వెళ్లలేక చివరకు ఆ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. చివరిసారిగా తల్లిదండ్రులు, పిల్లలను క్షమించమని కోరుతూ.. ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జునకాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
చెన్నూరు మండలం నస్పూర్కు చెందిన వనిత (35)కు సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిష్టయ్య.. కుటుంబంతో నాగార్జునకాలనీ సింగరేణి క్వార్టర్లో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. భార్యపై అనుమానంతో కిష్టయ్య ఆమెను తరచూ వేధిస్తుండేవాడు. ఇంట్లోనుంచి ఏ చిన్న అవసరమై బయటికి వెళ్లినా కూడా ఎందుకు.. ఎవరు.. అని నిత్యం ప్రశ్నలతో నరకం చూపించేవాడు. ఈ వేధింపులను భరించలేని వనిత.. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్య చేసుకునే ముందు.. ‘‘నా భర్త కిష్టయ్య పెద్ద సైకో.. ఎప్పుడు ప్రేమగా చూడలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్తే అనుమానించేవాడు. అతని వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యాను. అందుకే చనిపోతున్నా..’’ అని పేర్కొంది. తన పిల్లలను భర్తకు అప్పగించవద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను లేఖలో తెలుపుతూ ఉరేసుకుంది. బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె ఉరేసుకొని కనిపించడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వనిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.