అమ్మాయిలు పిలిస్తే పోలోమని వెళ్లకండి.. ఇలా కొడతారు
సోషల్ మీడియాలో పరిచయమైన యువతితో ఓ యువకుడు మాటలు కలిపాడు. అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నేరుగా కలుద్దామనుకున్నాడు. అనుకున్నట్టుగానే కలిశాడు.. కానీ ఆ తర్వాతే ఆ యువతి అసలు రంగు బయటపడింది. హైదరాబాద్లోని మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా.. బెంగళూరుకు చెందిన బడిగ జీవన్(24)కు బోడుప్పల్కు చెందిన రజిత అనే యువతి ఇన్స్టా ద్వారా పరిచయమైంది. అతన్ని హైదరాబాదుకు రావాలని యువతి కోరింది. ఆమె మాయమాటలు నమ్మి ఈ నెల 12న(ఆదివారం) బెంగుళూరు నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. అక్కడే రజిత కోసం ఎదురుచూస్తుండగా.. రజితతోపాటు చింటు అనే యువకుడు వచ్చి అతడిని బోడుప్పల్లోని ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఇద్దరూ కలిసి జీవన్ను రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. అతని దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.