కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు డాక్టర్లు. వారికి మత్తు మందు ఇచ్చి.. సౌకర్యాలు సరిగా లేవంటూ ఆపరేషన్ చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలంతా గంటల పాటు సృహలో లేకుండా మత్తులోనే ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జిల్లా యంత్రాంగం రామ్నగర్లోని సీఎహెచ్సీలో సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్ను నిర్వహించింది. ఉదయం 11 గంటలకు ఆపరేషన్లు జరగాల్సి ఉండగా.. మొత్తం 19 మంది మహిళలు క్యాంపునకు వచ్చారు. కాగా మరికొద్దిసేపట్లో డాక్టర్ వస్తారన్న సమయంలో.. అక్కడున్న వైద్య సిబ్బంది 10 మహిళలకు మత్తుమందు ఇచ్చారు. ఇక డాక్టర్ వచ్చాక.. అపరేషన్ చేయాల్సిన మహిళల గురించి, అక్కడి సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగాడు. ఆ తర్వాత క్యాంపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సౌకర్యాలు సరిగ్గాలేవని క్యాంపులో గందరగోళం సృష్టించారు. చివరకు ఆపరేషన్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అప్పటికే ఆ 10 మంది మహిళలకు మత్తు ఇవ్వడంతో వారంతా స్పృహ కోల్పోయి ఉన్నారు. ఈ ఘటనపై మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మెలకువ వచ్చాక జరిగింది తెలుసుకున్న.. మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆపరేషన్ చేసుకోకుండానే ఇళ్లకు వెనుతిరిగి వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ అవధేష్ యాదవ్.. డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.