మన బ్రెయిన్ను యాక్టివ్ ఉంచుకోవడానికి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు.. యోగాలో కొన్ని ప్రాణాయామాలు మనిషి బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి. ఏకాగ్రత పెంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద నుంచి లేచి కూర్చోలేని వారు కూడా ఆ ఆసనాలు వేయొచ్చని చెబుతున్నారు.
మనం ఏ పని చేయడానికైనా ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత లేకపోతే దేనినీ సాధించలేం.ఈ రోజుల్లో బిజీలైఫ్ స్టైల్, ఒత్తిడి కారణంగా చాలా మందికి పనుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. బ్రెయిన్ యాక్టివ్గా లేకపోయినా కూడా ఏకాగ్రత ఉండదు. అందుకే చాలా వయసులోనే మతిమరుపు, అలసత్వంలాంటివి వచ్చేస్తున్నాయి. వయసు మీద పడుతున్నకొద్దీ శరీరంతో పాటు మెదడుకూ వృద్ధాప్యం వస్తుందన్నది నిజం. మన బ్రెయిన్ను యాక్టివ్ ఉంచుకోవడానికి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ప్రాణాధారణ:
ప్రాణ ధారణ అనేది ఒక రకమైన ధ్యానం. ఇలా చేయడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది అలాగే మీ జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది. ఈ ధ్యానం చేయడం వల్ల పనిలో ఫోకస్ కూడా పెరుగుతుందని అన్నారు. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద శ్రద్ధ చూపాలి. సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోని శరీరాన్ని రిలాక్స్ గా ఉంచాలి.తర్వాత కళ్ళు మూసుకుని, శ్వాసలను లెక్కించాలి. ఒకసారి గాలి పీల్చి, వదిలితే ఒక చక్రం పూర్తవుతుంది. ఒకవేళ మధ్యలో తప్పిపోయి, లెక్కపెట్టడం మరచిపోతే, మొదటి నుంచి మళ్ళీ లెక్కపెట్టాలి. క్రమంగా అభ్యాసంతో శ్వాసల సంఖ్యను పెంచవచ్చు. ఎంత ఎక్కువ సేపు చేయగలిగితే అంతమంచిది. కనీసం అరగంటపాటు చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
భ్రమరీ ప్రాణాయామం:
భ్రమరీ ప్రాణాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరం రికవరీ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీనిని ప్రాక్టిస్ చేసే సమయంలో వచ్చే ప్రకంపనల వల్ల ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి మానసిక సమస్యలు నయమవుతాయి. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని అరచేతులను ముఖం మీద ఆనించాలి. చూపుడు వేళ్ళతో కళ్ళ మీద నెమ్మదిగా నొక్కాలి. మధ్య వేళ్ళను ముక్కు పక్కన, ఉంగరం వేళ్లను పెదాల మీద, చిటికెన వేళ్ళను నోటి మీద ఉంచుకోవాలి. బొటన వేళ్ళతో చెవులను నెమ్మదిగా మూయాలి. ఇప్పుడు ముక్కుతో గాఢంగా శ్వాస తీసుకొని మ్.. మ్.. అని చప్పుడు చేస్తూ గాలిని వదలాలి. ఇది చేస్తున్నప్పుడు మనం చేస్తున్న శబ్దం మీద, శ్వాసమీద దృష్టిని కేంద్రీకరించాలి.
షణ్ముఖి ముద్ర:
ఏకాగ్రతను పెంపొందించడంలో ఈ యోగాసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది మన దృష్టిని మరల్చడానికి పని చేసే కళ్ళు, చెవులు, నోటిని మూసి ఉంచేటప్పుడు శరీరం లోపల దృష్టిని కేంద్రీకరిస్తుంది.ఇందుకోసం పద్మాసనంలో కూర్చోవాలి. వెనుకభాగం నిటారుగా, ఛాతీ, భుజాలు స్టిఫ్గా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకి చాచి, పాదాలను తెరవాలి. చిటికెన వేలును పెదవి కింద పెట్టాలి. ఉంగరపు వేలును పెదవి పైన ఉంచాలి. మధ్య వేలిని కళ్ళ కింద ఉంచాలి. చూపుడు వేళ్ళను కళ్ళపై ఉంచండి. బ్రొటనవేళ్ళతో చెవులను ప్లగ్ చేయాలి. ఇప్పుడు గాలి పీల్చి ఈగ శబ్దం చేస్తూ గాలి వదలాలి.
పైన చెప్పిన ఆసనాలు…ఎవరి దగ్గరైనా ముందు ట్రైనింగ్ తీసుకోగలిగితే చాలా మంచిది. లేదా దీనికి సంబంధించి బోలెడు వీడియోలు యూట్యూబ్ లో కూడా లభ్యమవుతాయి. వాటిని ఫాలో అయి కూడా చేయవచ్చు.