ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ మదర్సాలకు గట్టి షాక్ ఇచ్చింది. కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ”రాష్ట్రంలోని మెజారిటీ మదర్సాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి అందదు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మదర్సాలు ఉన్నాయి. అందులో 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందిస్తుంది. మిగిలిన మదర్సాలకు ప్రభుత్వం సాయం ఉండదు” అని ప్రకటన విడుదల చేసింది.
గత బడ్జెట్లో యూపీ సర్కారు మదర్సాల ఆధునికీకరణ పథకానికి కింద రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఆ నిధులతో మదర్సాలను ఆధునికీకరిస్తామని తెలిపింది. కానీ, ప్రస్తుతం 558 మదర్సాలను మాత్రమే ఆధునికీకరిస్తామని, మిగతా వాటికి నిధులు ఇవ్వమని తేల్చి చెప్పింది. దాంతో మదర్సాలను నడుపుతున్న యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇటీవలే యూపీ సర్కార్ తరగతులు ఆరంభానికి ముందు మదర్సాలలో విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం గడవక ముందే కొత్త మదర్సాలను నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది.