దాయాది దేశమైన పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులతో దేశం ఉక్కిబిక్కిరి అవుతోంది. తాజాగా పాక్లో పరిస్థితులు ఎంతలా దిగుజారుతున్నాయో.. అద్దం పట్టేలా మరో విషయం వెలుగులోకి వచ్చింది. జంతువుల ఆలనా పాలనా చూసుకోలేక అమ్మేందుకు సిద్ధమైంది పాక్ ప్రభుత్వం.. అది కూడా సింహాలను అమ్మకానికి పెట్టింది . ఆ దేశ మీడియా సంస్థల్లో ఇందుకు సంబంధించిన పలు కథనాలు ప్రసారమవుతున్నాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి.
లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాకిస్తానీ) రూ.150,000 కంటే(భారత కరెన్సీలో 50 వేలు) కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్లో ఒక గేదె ధర ఆన్లైన్ మార్కెట్లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది. ఇక, లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి. వీటిని ప్రీమియంతో ప్రైవేట్ హౌసింగ్ స్కీమ్లు లేదా పశుసంవర్ధక ఔత్సాహికులకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
లాహోర్ సఫారీ జంతుప్రదర్శనశాల, దేశంలోని ఇతర జంతుప్రదర్శనశాలల వలె కాకుండా పెద్ద మొత్తంలో విస్తరించి ఉంది. 142 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఇందులో అనేక వన్యప్రాణులు ఉన్నాయి. అయితే దీనిలో మొత్తం 40 సింహాలు ఉన్నట్లు పేర్కొంది. వాటిని నిర్వహించడం కష్టం మాత్రమే కాదు.. చాలా ఖరీదైనదిగా పేర్కొంటున్నారు. అందువల్ల, జూ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొన్ని సింహాలను క్రమం తప్పకుండా విక్రయిస్తారని.. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖర్చుల కోసం ఉపయోగిస్తారని పేర్కొంటున్నారు.