ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా కొందరు హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. మంచి ఆహారపు అలవాట్లు, సరైనా జీవన విధానం అనుసరించే..సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కేవలం 40 ఏళ్ల కే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీలో ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. జిమ్ చేసి తిరిగి ఇంటికి బయల్దేరిన క్రమంలో సడెన్గా గుండెపోటు రావడంతో సాయిప్రభు (25) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. స్నేహితులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. మే 3న అతనికి పెళ్లి నిశ్చయించామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని బోరున విలపించారు.
తాజాగా హైదరాబాద్లోని బోయిన్ పల్లిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విశాల్.. జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. గురువారం తన విధులను ముగించుకొని సికింద్రాబాద్ లోని ఓ జిమ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జిమ్ సిబ్బంది అతనిని వెంటనే హస్పిటల్ కి తరలించగా, అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.