అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్(25) విహార యాత్రకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి మరణించారు. వారాంతం కావడంతో ఈనెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరితో కలిసి ఐర్లాండ్లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకునే లోపే టెక్నికల్ ప్రాబ్లెం వల్ల బోటు ఆగింది. బోటు ఉన్న ప్రాంతం లోతు తక్కువే అనుకొని యశ్వంత్ నీటిలోకి దిగారు. కానీ సముద్రపు అలల తాకిడి ఇంకాస్త లోపలికి వెళ్లారు
అలలు ఎక్కువగా ఉండటంతో ఎంత ఈతకొట్టిన బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. యశ్వంత్ తండ్రి కంటె మల్లయ్య చందుర్తి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్ మృతితో సుభాష్నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి.