వచ్చే ఎన్నికల్లో తన బిడ్డ షర్మిలను పాలేరులో భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ విజయమ్మ కోరారు. గురువారం పాలేరులో పర్యటించిన ఆమె వైఎస్సార్టీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాలేరును షర్మిలకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. పాలేరు ప్రజలకు షర్మిల జీవితాంతం సేవ చేస్తుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి పులివెందుల ఎలాగో తన కూతురు షర్మిలకు పాలేరు అలాంటిదేనని విజయమ్మ అన్నారు. పాలేరు ప్రజలు తన భర్తకు, తమ కుటుంబానికి ఎప్పుడూ సన్నిహితంగా ఉన్నారని గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను అందరం కలిసి సాధించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుందని చెప్పారు. వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ కాదని అనేవాళ్లకు ఆమె ప్రేమనే జవాబు చెబుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన కార్యాలయం తాత్కాలికమైనా కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందన్నారు. జూలై 8న కొత్త ఆఫీసు, ఇంటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు